Tuesday, 21 July 2026

జనచైతన్య స్ఫూర్తి దాశరథి (జయంతి జూలై 22)


 

దాశరథి కృష్ణమాచార్యులు (1925 – 1987) తెలుగు సాహితీ లోకంలో అభ్యుదయ కవిగా, విప్లవగళంగా, సినీ గీత రచయితగా చెరగని ముద్ర వేసిన మహనీయుడు. తెలంగాణ విమోచన పోరాటంలో తన కలంతో, గళంతో ప్రజా చైతన్యాన్ని రగిలించిన ఉద్యమకారుడు.

1925 జూలై 22న ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూర్ గ్రామంలో జన్మించారు. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్‌లలో సంస్కృతం, తెలుగు, ఉర్దూ, పారసీ భాషలలో ప్రావీణ్యం సంపాదించారు.

నిజాం నిరంకుశ పాలనకు, భూస్వామ్య అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆంధ్ర మహాసభ తరఫున చురుగ్గా పాల్గొన్నారు

నిజాం ప్రభుత్వం ఆయనను నిజామాబాద్, వరంగల్ జైళ్లలో బంధించింది. జైలులో కలం, కాగితం ఇవ్వకపోతే, బొగ్గు ముక్కలతో జైలు గోడలపై పద్యాలు రాసి తన నిరసన తెలిపారు.

“నా తెలంగాణ, కోటి రతనాల వీణ"

"ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని"

దాశరథి కవిత్వం సమాజంలో చైతన్యాన్ని, ఆవేశాన్ని నింపేలా ఉండేది. పద్యం, గేయం, వచనం.. ఏ రూపమైనా ఆయన శైలి ప్రత్యేకమైనది.

ఆయన రచనల్లో ‘అగ్నిధార‘ నిజాం పాలనపై ఎక్కుపెట్టిన మొదటి కావ్య అస్త్రం. ‘రుద్రవీణ‘ తెలంగాణ ప్రజల తిరుగుబాటును ప్రతిబింబించే కావ్యం. ‘మహాంధ్రోదయం‘ విశాలాంధ్ర అవశ్యకతను చాటిచెప్పిన రచన. ‘తిమిరంతో సమరం‘ సమాజంలోని చీకట్లతో చేసిన పోరాటానికి అద్దం పట్టే కావ్యం. ‘పునర్నవం‘ కవితా పుష్పకం, అమృతాభిషేకం.‘యాత్రాస్మృతి’ ఆయన జీవిత విశేషాల సమాహారం.

1961లో ‘వాగ్దానం’ చిత్రంలో పాటతో సినీ ప్రస్థానం ప్రారంభించారు. దాదాపు 2,000 పైగా పాటలు రాసి, మధురమైన సాహిత్యంతో శ్రోతలను అలరించారు.

ఆయన రాసిన ‘తిమిరంతో సమరం’ కావ్యానికి 1974 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

1977 నుంచి 1983 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవిగా సేవలు అందించారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు.

దాశరథి కృష్ణమాచార్యులు 1987 నవంబరు 5న కన్నుమూశారు. ఆయన రాసిన పద్యాలు, గేయాలు తెలుగు భాష ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచిపోతాయి.*


No comments:

Post a Comment

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

 అదృష్టవంతులు (1969) జగపతి పిక్చర్స్ కు అదృష్టం తెచ్చి పెట్టిన సినిమా అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదల అయింది. వీబీ రాజేంద్ర ప్రసాద్...